మహారాస్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులతో సినిమాను తలపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు గడిచినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అయితే, ఎట్టకేలకు ముఖ్యమంత్రి పదవి విషయంలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడి.. మహాయుతిలో ఎట్టకేలకు ఏకాభిప్రాయం వచ్చింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పగ్గాలు చేపడతారని ప్రచారం సాగుతోంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని ఆజాదీ మైదానంలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్భవన్కు చేరుకున్న ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు .. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కోరారు.
అనంతరం ముగ్గురు నేతలూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ను లక్ష్యంగా చేసుకుని షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఫడ్నవీస్ మాట్లాడుతూ... ‘గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది... ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారో నేటి సాయంత్రానికి కొలిక్కి వస్తుంది.. నిన్న ఏక్నాథ్ షిండేను కలిసి.. ప్రభుత్వంలో చేరాలనేది మహాయుతి ప్రతి కార్యకర్త కోరిక అని ఆయనకు తెలియజేశాను.. ఆయన సానుకూలంగా స్పందిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నా’ అని అన్నారు.
ఈ క్రమంలో మీరు, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అని షిండేను మీడియా ప్రశ్నించగా.. దీనిపై నిర్ణయం కొలిక్కి రావాలంటే సాయంత్రం వరకు వేచి చేయాల్సిందేనని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో అజిత్ పవార్ జోక్యం చేసుకుంటూ... తానైతే ప్రమాణ స్వీకారం చేస్తానని, షిండేకు సాయంత్రం వరకు తెలిసి వస్తుందోమోనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు షిండేకు ఎక్కడో కాలినట్టయ్యింది. వెంటనే ‘అజిత్ పవార్కు ఉదయం, సాయంత్రం పూట ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది’ అని చురకలు అంటించారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్తో పాటు మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. ఇక, మీడియా సాక్షింగా మహాయుతిలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa