పట్టపగలే పాఠశాలలో ప్రిన్సిపల్ను స్టూడెంట్ కాల్చి చంపిన సంచలన ఘటన మధ్యప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్కూల్లో క్లాసులు జరుగుతున్న సమయంలో.. ప్రిన్సిపల్ వాష్రూంకు వెళ్తుండగా గమనించిన ఆ స్టూడెంట్ వెనకాలే వెళ్లాడు. తీరా బాత్రూంలోకి వెళ్లిన తర్వాత తాను తీసుకువచ్చిన తుపాకీతో ప్రిన్సిపల్పై కాల్పులు జరిపాడు. అయితే తుపాకీని నేరుగా తలకు పెట్టి కాల్చడంతో ఆ ప్రిన్సిపల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి రక్తపుమడుగులో విలవిలలాడాడు. అయితే బుల్లెట్ శబ్దం విన్న స్కూల్ సిబ్బంది, టీచర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూంలో చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రిన్సిపల్ను చూసి షాక్ అయ్యారు. ప్రిన్సిపల్ను కాల్చి చంపిన తర్వాత ఆ విద్యార్థి మరో విద్యార్థి బైక్ ఎక్కి పరారయ్యాడు.
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో జరిగిన ఈ విషదకరమైన సంఘటన తీవ్ర సంచనలం రేపుతోంది. ధమోరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ అయిన 55 ఏళ్ల సురేంద్ర కుమార్ సక్సేనా.. సుమారు 5 ఏళ్లుగా అదే స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం స్కూల్ టాయిలెట్కు వెళ్తుండగా.. అదే స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఫాలో అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ తలపై తుపాకీ పెట్టి కాల్పులు జరిపాడు. ఆ ప్రిన్సిపల్ కుప్పకూలిపోగానే.. మరో విద్యార్థితో కలిసి ప్రిన్సిపల్ సురేంద్ర కుమార్ సక్సేనా బైక్ తీసుకుని వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
ఈ కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరుగు పరుగున బాత్రూంకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి చనిపోయిన ప్రిన్సిపాల్ను చూశారు. ఈ సమాచారం పోలీసులకు అందించగా.. వారు హుటాహుటిన ఆ స్కూల్కు చేరుకుని.. సురేంద్ర కుమార్ సక్సేనా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్ సక్సేనాపై కాల్పులు జరిపిన తర్వాత అతడు మరో విద్యార్థితో కలిసి పారిపోవడాన్ని వారు గమనించారు. ఆ ఇద్దరు విద్యార్థులు ధిలాపూర్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీమ్లు రంగంలోకి దిగి గాలింపు చేపట్టినట్లు చెప్పారు. అయితే వారిద్దరు విద్యార్థులు స్కూల్లో సక్రమంగా ఉండేవారు కాదని తెలుస్తోంది. అందుకే ప్రిన్సిపల్ వారిని మందలించడంతో పగ పెంచుకుని హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa