ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు చెవిలో పూలు పెట్టారు.. మోదీ పిలక ఆయన చేతుల్లోనే ఉంది: వైఎస్ షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 06:21 PM

సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై విమర్శల వర్షం కురిపిస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా మరో ట్వీట్ చేశారు. విభజన హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని వైఎస్ షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి వైఎస్ షర్మిల సెటైర్లు గుప్పించారు.


విజన్ 2047 పేరుతో చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే కావాల్సింది విజన్లు కాదనీ.. విభజన హామీలని పేర్కొన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపాలంటే కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. దశాబ్దకాలంగా విభజన హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. విభజన సమయంలో యూపీఏ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా హామీతో పాటుగా.. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా, నూతన రాజధానికి ఆర్థిక సహాయం, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, పరిశ్రమల ఏర్పాటు, కడప స్టీల్, దుగరాజపట్నం పోర్టు నిర్మా్ణం, నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడ ర్యాపిడ్ రైల్ హామీలు విభజన చట్టంలో ఇచ్చిందని షర్మిల గుర్తుచేశారు.


అయితే పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వీటికి దిక్కులేదన్న వైఎస్ షర్మిల.. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని.. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని పేర్కొన్నారు. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించడంతో పాటుగా.. పోలవరం ప్రాజెక్టు పూర్తై ఏపీ సస్యశ్యామలం అయ్యేదన్నారు. విభజన హామీలు అమలై ఉంటే రాష్ట్రం దిశ - దశ పూర్తిగా మారేదని.. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేదని షర్మిల అభిప్రాయపడ్డారు.


విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ షర్మిల ఆరోపించారు. ముగ్గురూ కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోదీ నమ్మిస్తే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు.


25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్.. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమేనన్న వైఎస్ షర్మిల.. హోదాతోనే రాష్ట్రానికి విజన్ అని పేర్కొన్నారు. మోదీ పిలక చంద్రబాబు చేతుల్లోనే ఉందన్న షర్మిల.. విభజన హామీలపై ప్రధానిని నిలదీయాలని.. కేంద్రం గల్లా పట్టి రాష్ట హక్కులు సాధించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa