ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 06:47 PM

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి. దీనిపై నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో మహిళలు అందరూ ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం హామీ అమల్లోకి వస్తుందంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అమల్లోకి రాలేదు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పుడు అమలు చేస్తారా అనే దానిపై మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్‌లో శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీసును మంత్రి మండిపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. త్వరలోనే ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుందన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈ క్రమంలోనే కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.


మరోవైపు ఏపీఎస్ఆర్టీసీని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని.. ఇప్పటికే పలుచోట్ల నూతన బస్సు సర్వీసులు ప్రారంభమైనట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే మరో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ప్రయాణికుల భద్రతకు ఏపీఎస్ఆర్టీసీ పెద్ద పీట వేస్తుందన్న మంత్రి.. ఆర్టీసీ సిబ్బంది బాగోగులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఆక్రమణలకు గురైన ఆర్టీసీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa