రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. కెమికల్స్తో నిండి ఉన్న ఓ ట్రక్కు మరికొన్ని వాహనాలను ఢీకొట్టడం వల్ల మొత్తం ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మొత్తం 37 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఉవ్వెత్తున ఎగిసి పడ్డ మంటల్లో పడి సుమారు 30 ట్రక్కులతో పాటు మరిన్ని వాహనాలు దగ్ధం అయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాద బాధితులకు ఆర్థికంగా సాయం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మృతులతో పాటు క్షతగాత్రులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జయపుర-అజ్మేర్ రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 25కు పైగా అంబులెన్సులలో బాధితులను ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. అలాగే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేసింది. పెద్ద ఎత్తున ప్రమాదం జరగగా.. రోడ్డుపై రాకపోకలు అన్నీ స్తంభించిపోయాయి. గంటల పాటు వాహనాలు అన్నీ 300 మీటర్ల మేర నిలిచిపోయాయి.
ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను కలిసి మరీ వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడనట్లు సమాచారం. ఆ తర్వాతే ప్రధాని... జైపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యంగా ఈ ప్రమాదంలో చనిపోయిన ఒక్కో మృతుడికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికీ 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ డబ్బులు అన్నీ పీఎం సహాయ నిధి నుంచి వస్తాయని వివరించారు. అలాగే బాధితులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ ప్రజలు ప్రధాని మోదీ మంచి మనసుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా ఇప్పటి వరకూ ఎక్స్గ్రేషియా మాత్రం ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa