ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.'చంద్రబాబు గారు... మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే... ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే... చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారు' అని షర్మిల విమర్శించారు.వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని షర్మిల దుయ్యబట్టారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని, పారిశ్రామిక కారిడార్ల స్థాపన జరగలేదని, 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని, కడప స్టీల్ కట్టలేదని, విశాఖ ఉక్కును రక్షించలేదని విమర్శించారు.ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదని మోదీపై విమర్శలు గుప్పించారు. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని, విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని ప్రకటన చేయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa