ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు రోగం తెప్పించిన తల్లి.. కారణం చెబితే దేంతో కొడతారో

international |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 10:45 PM

తల్లిగా మారిన ప్రతీ అమ్మాయి.. మొదటి రోజు నుంచే తన బిడ్డకు ఏమీ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రతినిత్యం జాగ్రత్తగా ఉంటూ.. చిన్నారికి ఎలాంటి గాయాలు కాకుండా చూస్తుంది. ఒకవేళ బిడ్డ ఏవైనా హానికర పదార్థాలు తింటే.. కన్నీరు కారుస్తూ మరీ వెంటనే ఆస్పత్రికి వెళ్లి బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటుంది. ఇవన్నీ మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ తల్లి మాత్రం.. ఆరోగ్యంగా ఉన్న తన ఏడాది బిడ్డకు కావాలని రోగం తెప్పించింది. ముఖ్యంగా ఇంట్లో మిగిలిపోయిన మాత్రలు తినిపించి అనారోగ్యం పాలు చేసింది. ఆపై ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా అద్భుతమైన సినిమా కథ అల్లింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ఏడాది వయసున్న ఓ బిడ్డ ఉంది. మొదటి నుంచి సదరు మహిళకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. నిత్యం అనేక రకాల పోస్టులు పెడుతూ... లైకులు, కామెంట్లు, షేర్ల కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఫాలోవర్లను పొందేందుకు అనేక రకాల స్టంట్లు చేస్తోంది. అయితే తాజాగా ఈమె ఓ దారుణానికి పాల్పడింది. ముఖ్యంగా ఫాలోవర్లతో పాటు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని.. ఏడాది వయసు ఉన్న తన కూతురును రంగంలోకి దింపింది.


2024 ఆగస్టు నుంచి అక్టోబర్ నెలల మధ్య ఇంట్లో మిగిలిపోయిన అనేక రకాల మాత్రలను బిడ్డకు తినిపించి.. ఆమెకు లేని రోగాన్ని వచ్చేలా చేసింది. ముఖ్యంగా బిడ్డ శరీరంపై వచ్చిన దద్దుర్లు, ఇతర ఇన్ఫెక్షన్లను ఫొటోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టింది. తన బిడ్డ ఆరోగ్యం బాగాలేదని.. తీవ్ర అనారోగ్యానికి గురైందంటూ వెల్లడించింది. ఆస్పత్రికి తీసుకువెళ్తే వైద్యులు ఓ పెద్ద రోగం వచ్చిందని చెప్పారంటూ.. ఆ వైద్య ఖర్చులు భరించే స్తోమత తనకు లేదంటూ చెప్పింది. ఈక్రమంలోనే తన ఫాలోవర్లను సాయం చేయాల్సిందిగా కోరింది.


అయితే ఆమె చేసిన పోస్టులు చూసిన నెటిజెన్లు.. నిజంగానే చిన్నారి ఆరోగ్యం బాగాలేదని భావించి విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇలా ఇప్పటి వరకు ఆ మహిళకు మొత్తంగా 37, 300 డాలర్ల విరాళాలు వచ్చాయి. ఈక్రమంలోనే చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. సదరు మహిళ ఇటీవలే బిడ్డను ఆస్పత్రిలో చేర్పించింది. పరీక్షించిన వైద్యులు ఆ బిడ్డకు.. ఎవరో అనేక రకాల మాత్రలు తినిపించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఈక్రమంలోనే బిడ్డ తల్లిని విచారించగా.. ఒక్కోసారి ఒక్కోలా సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా.. తానే డబ్బుల కోసం ఇదంతా చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్‌ను పరిశీలించగా.. ఆమె చెప్పింది నిజమేనని గుర్తించారు. డబ్బుల కోసం కన్నబిడ్డ ఆరోగ్యాన్ని నాశనం చేసిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొన్నిరోజుల్లో కోర్టులో హాజరు పరచనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa