అరటిపండ్లు సాధారణంగా డజన్లు లేదంటే కిలోల లెక్కన కొనుగోలు చేస్తుంటాం. డజను మహా అయితే ఓ రూ.60-70 వరకు ఉంటుంది. అరుదుగా లభించే చక్కర కేళీ వంటివి రూ.100పైనే ఉంటాయి. అలాంటిది ఒక అరటి పండు రూ.100 అంటే నమ్ముతారా? ఇది నమ్మశక్యంగా లేకపోయినా భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యాత్రికుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. పోనీ ఓ సూపర్ మార్కెట్ లేదా సేంద్రీయ ఉత్పత్తుల దుకాణంలో అనుకునేరు.. అదీ మన హైదరాబాద్ నగరంలోని ఓ తోపుడు బండిపై!. హగ్ అనే రష్యన్ యువకుడు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తూ.. తోపుడు బండిపై అరటిపళ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
ఓ అరటి పండు ఎంత అని అతడు అడిగితే.. ఆ వ్యక్తి రూ.100 అని సమాధానమిచ్చాడు. అతడు చెప్పింది తాను సరిగ్గా వినలేదేమోనని భావించిన అతడు మరోసారి ధర ఎంత అని అడిగాడు. ఈసారి కూడా అతడు అలాగే చెప్పడంతో షాకయ్యాడు. డజను అనుకుని ఉంటాడని.. ఒక అరటి పండు చూపించినా మళ్లీ ఆ వ్యాపారి రూ.100 అని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన హగ్.. అంత ధర చెల్లించలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు, యూకేలో కూడా ఇంత రేటు ఉండదని, ఒక్క పౌండ్ (అంటే భారత కరెన్సీలో రూ.100)కు 8 వస్తాయని అనుకున్నాడు.
ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో వీడియోతో సహా పోస్టు చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ‘ఓహ్.. బనానా మ్యాన్.. నమస్కార్.. అరటి పండ్లు ధర ఎంత అని హిందీలో అడిగితే.. అతడు ఒకటి వంద రూపాయలు’ అని హిందీ ఇంగ్లీషులో చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. ‘బాబోయ్ అంత ధర పెట్టి నేను కొనలేను.. యూకేలో అయితే పౌండుకు 8 అరటి పండ్లు వస్తాయి..’ అని హగ్ అన్నాడు. ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. ఈ సంఘటన హైదరాబాద్లోనే జరిగింది. ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైనందుకు క్షమాపణలు అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa