కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రైతులకు సంబంధించిన అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహ రైతుల డిమాండ్ల ఊసేలేదని ఆక్షేపించింది. వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ట్యాక్సేషన్, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్ధిక రంగం, విద్యుత్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఈ ఆరు ప్రధాన రంగాలపైనే తమ ప్రభుత్వం దృష్టిసారించి బడ్జెట్కు రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాలో ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు.
కాగా, ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ స్పందించింది. ‘వ్యవసారంగంతోనే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన ఆర్ధిక మంత్రి.. ఆ రంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు, పంటలకు మద్దతు ధర చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, ప్రధానమంత్రి కిసాన్ చెల్లింపుల ద్రవ్యోల్బణ సూచిక, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంస్కరణలు సహా అన్నదాత డిమాండ్లను పూర్తిగా విస్మరించారు.... నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మేకిన్ ఇండియా ఇప్పుడు పేరు ఫేక్ ఇన్ ఇండియాగా మారింది’ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
మరోవైపు, బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట కలిగించింది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి సుకం ఉండబోదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో వేతన జీవులకు భారీ ఊరట దక్కిందని చెప్పొచ్చు. అలాగే గిగ్ వర్కర్ల కోసం బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్టు మంత్రి చెప్పారు. దీంతో పాటుగా కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకొస్తామని, వచ్చే వారమే పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టనున్నట్లు ఆమె వివరించారు. ఇక, ఈ ఏడాది నవంబరులో ఎన్నికల జరగనున్న బిహార్కు వరాల జల్లు కురిపించారు. మఖానా బోర్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు సహా అనేక పథకాలను బడ్జెట్లో ప్రకటించారు.