దేశ రాజధాని ఢిల్లీలో మరో నాలుగు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అయితే.. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అలాగే ఇతర పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ వారికి జనాలు ఓట్లు వేయకుండా చేసేందుకు కృషి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. తమ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే జరగబోయేది అదేనంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మరో నాలుగు రోజుల్లో జరగబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సర్కారు ఓడిపోతే.. జరగబోయేది ఇదేనంటూ కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో బీజేపీ మద్దతుదారులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మద్దతుదారులతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఓ అభిమానిని కలిశాని.. అప్పుడు ఆయన ఈ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఎలా అని ప్రశ్నించినట్లు తెలిపారు. దానికి అతడు కచ్చితంగా సమాధానం తెలుసుకోవాలని కేజ్రీవాల్ వెల్లడించారు.
ఈక్రమంలోనే వీడియోలో ఆ సమాధానం వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ అద్మీ పార్టీ ఓడిపోతే.. ఉచిత కరెంట్, నీరు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అన్నీ ఆగిపోతాయని స్పష్టం చేశారు. బీజేపీ వీటన్నిటినీ ఆపేస్తుందన్నారు. అలాగే ఢిల్లీ ప్రజలు అందరికీ నెలకు రూ.25 వేల ఖర్చు పెరిగిపోతుందన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్కారు బడులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. అలాగే ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుందో లేదో కూడా తనకంటే జనాలకే బాగా తెలుసని చెప్పారు.
బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా.. బీజేపీ మద్దతుదారులు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని సూచించారు. వారంతా ఆ పార్టీని వీడినా, వీడికపోయినా ఓట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి వేసి గెలిపిస్తే ఢిల్లీ అభివృద్ధికి సాయం చేసిన వారు అవుతారన్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఢిల్లీలో ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 70 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa