హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర తలుపును తెరవగా ఇన్ఫ్లేటబుల్ స్లైడ్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎయిర్పోర్టులోని అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.విమాన ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి.ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో మరో ప్రమాదం జరగడంతో ఎఫ్ఏఏ ప్రమాదాలకు గల కారణాలపై దర్యాప్తును వేగవంతం చేసింది. జనవరి 30న వాషింగ్టన్ డీసీలో మిలిటరీ హెలికాప్టర్, అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఢీకొనడంతో రెండింట్లో ఉన్న మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిలడెల్ఫియాలోని ఓ మాల్ సమీపంలో మెడికల్ ట్రాన్స్పోర్టర్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు.