సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. ఒంగోలు రూరల్ పీఎస్ లో నమోదైన ఈ కేసులో వర్మ ఫిబ్రవరి 7న విచారణకు వస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ వర్మకు ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, తాను 7వ తేదీన విచారణకు వస్తానని, వెసులుబాటు కల్పించాలని వర్మ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు విచారణ అధికారిగా ఉన్న సీఐ శ్రీకాంత్ కు సమాచారం అందించారు. అధికారుల అనుమతి మేరకు వర్మ శుక్రవారం నాడు ఒంగోలులో విచారణకు హాజరు కానున్నారు.