ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోరాడి అలసిన గుండె.. శ్రద్ధా వాకర్ తండ్రి మృతి!

national |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 08:25 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. మూడేళ్ల క్రితం ఢిల్లీలో ఆమె ప్రియుడు అఫ్తాబ్ పునావాలా ఆమెను అత్యంత కిరాతకంగా నరికి ముక్కలు చేసి వాటిని రోజుల తరబడి ఫ్రిజుల్లో ఉంచాడు. ఆపై వాటిని సూట్ కేసుల్లో తీసుకు వెళ్తూ ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పడేశాడు. అయితే కూతురు కనిపించడం లేదంటూ ఆమె తండ్రి వికాస్ వాకర్ కేసు పెట్టగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రియుడు అఫ్తాబ్ జైల్లో ఉండగా.. వికాస్ వాకర్ కూతురు మృతి పట్ల న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాడు. కానీ న్యాయం జరగకముందే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆ పూర్తి విశేషాలు మీకోసం.


2019లో డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ పునావాలాలు మూడేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. ఆపై 2022లో ఢిల్లీకి పారిపోయి వచ్చారు. అక్కడే ఇద్దరూ కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. అయితే అదే ఏడాది మే 18వ తేదీన వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా.. అఫ్తాబ్ శ్రద్ధా వాకర్ గొంతు కోసి హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి వాటిని ఫ్రిజ్జులో పెట్టాడు. వీలు చూసుకుని సూట్ కేసుల్లో వాటిని తీసుకు వెళ్తూ ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పడేశాడు.


అయితే కూతురు ఫోన్ చేయకపోవడం, ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా ఎలాంటి సమాచారం దొరక్కపోవడంతో శ్రద్ధా వాకర్ తండ్రి.. వికాస్ వాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కానీ అఫ్తాబ్ మాత్రం కేసు నుంచి తప్పించుకోవడానికి మే 22వ తేదీనే ఆమె ఇల్లొదిలి వెళ్లిపోయిందని.. తన గురించి నాకేమీ తెలియదంటూ చెప్పుకొచ్చాడు. కానీ దర్యాప్తు చేసిన పోలీసులకు.. మే 26వ తేదీన శ్రద్ధా అకౌంట్ నుంచి 54 వేల రూపాయలు అఫ్తాబ్ అకౌంట్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు.


ఇదే విషయమై అఫ్తాబ్‌ను ప్రశ్నించగా.. మే 31వ తేదీన అతడు నేరం అంగీకరించాడు. అప్పటి నుంచి అఫ్తాబ్ జైల్లోనే ఉన్నాడు. తన కూతురును అంత దారుణంగా హత్య చేసిన నిందితుడికి మరణ శిక్ష విధించాలంటూ వికాస్ వాకర్ న్యాయం కోసం పోరాటం చేశారు. అలాగే ఆమె అస్థికలు ఇస్తే.. దహన కార్యక్రమాలు చేసుకుంటానంటూ కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. ఈ కేసులో నిందితుడికి ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష పడలేదు.


శ్రద్ధా అత్యంత దారుణంగా హత్యకు గురికావడంతో.. తండ్రి వికాస్ వాకర్ తట్టుకోలేకపోయారు. మానసికంగా, శారీరకంగా చాలా బలహీనమయ్యారు. కానీ న్యాయం కోసం మాత్రం తిరుగుతూనే ఉన్నారు. కూతురు జరిగింది మరెవరికీ జరగకూడదని.. మహిళలపై జరిగే హింసపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు. ముఖ్యంగా ఇలాంటి బంధాల్లో ఇరుక్కుని నరకం చూస్తున్న వారికి విముక్తి కల్పించడానికి 2024లో ఓ ఎన్జీఓను కూడా ప్రారంభించారు.


కానీ తాజాగా వికాస్ వాకర్ గుండెపోటుకు గురయ్యారు. వాసాయి వెస్ట్‌లోని తన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ దవాఖానాకు చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించగా.. కుటుంబ సభ్యులు అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. కూతురిపై బెంగతోనే ఆయన మానసిక వేదనకు గురయ్యారని.. ఈక్రమంలోనే గుండెపోటు వచ్చి చనిపోయారని చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com