ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా కుంభమేళాలో పుట్టిన 12 మంది శిశువులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 08:28 PM

144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ నగర్‌ మొత్తం భక్త కోటితో పులకించిపోతుంది. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళాలో ఇప్పటివరకు గత 28 రోజుల్లో 45 కోట్ల మంది గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి నిత్యం కోట్ల మంది భక్తులు.. మహా కుంభమేళాకు విచ్చేస్తున్నారు. అయితే మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. మహా కుంభ్‌నగర్‌‍లో అనేక మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించింది. ఇందులో భాగంగానే అక్కడ ఆస్పత్రులు ఏర్పాటు చేసింది.


అయితే ఈ ఆస్పత్రుల్లో గత 28 రోజుల్లో 12 ప్రసవాలు జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ 12 డెలివరీల్లో పలువురు మగ, ఆడ శిశువులు జన్మించినట్లు చెప్పారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే అవన్నీ నార్మల్ డెలివరీలే అని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన గర్భిణీలు మహా కుంభమేళాకు రాగా.. వారికి అక్కడే ప్రసవాలు జరిపినట్లు యూపీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మహా కుంభమేళా సందర్భంగా.. ప్రయాగ్‌రాజ్‌లో జన్మించిన ఆ శిశువులందరికీ రకరకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ పేర్లే దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి.


మరోవైపు.. కుంభమేళాలో పుట్టిన ఆడపిల్లలకు బసంతి, గంగ, జమున, బసంత్ పంచమి, సరస్వతి అని పేర్లు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అక్కడ పుట్టిన మగ పిల్లలకు కుంభ్, భోలేనాథ్, బజ్ రంగీ, నంది లాంటి పేర్లు పెట్టినట్టు మహా కుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇక ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ఈనెల 26వ తేదీన మహా శివరాత్రితో ముగియనుంది. దీంతో 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ, విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పోటెత్తుతున్నారు.


దీంతో మహా కుంభమేళాకు చేరుకునే అన్ని వైపులా రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. దాదాపు 350 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయినట్టు ప్రయాగ్ రాజ్ అధికారులు వెల్లడించారు. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెప్పడంతో అక్కడ ఎంత మంది భక్తులు వచ్చారో అర్థం అవుతోంది. మరోవైపు.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. అందులో చిక్కుకుపోయిన యాత్రికులకు నీరు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com