బ్రిటన్ కూడా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరునే బ్రిటన్ కూడా పాటిస్తోంది. అమెరికాలోకి అక్రమ మార్గాల్లో చొరబడిన వారిని.. వీసా గడువు ముగిసినా ఇంకా తమ దేశంలోనే ఉంటున్న వారి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని.. అరెస్ట్లు చేయడం, వారిని వారి స్వదేశాలకు పంపించడం చేస్తున్నారు. అమెరికాలో చట్టబద్ధంగా వచ్చినవారు మాత్రమే ఉండాలని కరాఖండిగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే బ్రిటన్లోనూ ప్రారంభం అయింది. గతేడాది జులైలో యూకేలో అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ.. తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. తనిఖీలు చేపట్టి మరీ.. అక్రమ వలసదారులను పట్టుకుని అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతోంది.
బ్రిటన్ వ్యాప్తంగా అక్రమ వలసదారులను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ రెస్టారెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి గాలింపు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి యూకే హోం సెక్రటరీ య్వెట్ కూపర్ సోమవారం కీలక ప్రకటన చేశారు. జనవరి నెలలో 828 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామని.. ఈ సంఖ్య గత ఏడాది జనవరితో పోల్చితే 48 శాతం అధికం అని వివరించారు. ఈ తనిఖీల్లో మొత్తం 609 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది జనవరి నెలలో యూకేలో అరెస్ట్ చేసిన వారి కంటే ఇది 73 శాతం అధికం అని తెలిపారు.
మరోవైపు.. అక్రమ వలసదారులను గుర్తించేందుకు యూకే అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా.. అందులో భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, దుకాణాలు, కార్ వాష్ సెంటర్లపై ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు. హంబర్సైడ్లోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో తనిఖీలు చేసి ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అందులో నలుగురిని దేశం నుంచి పంపించినట్లు యూకే హోంశాఖ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక తమ దేశంలో ఉండే అక్రమ వలసదారుల విషయంలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ఒక ప్రకటన చేశారు. వివిధ దేశాల నుంచి అనేక మంది అక్రమ మార్గాల్లో యూకేకు వచ్చి.. ఇక్కడ పని చేస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే ఇలాంటి అక్రమ వలసలకు తమ ప్రభుత్వం ముగింపు పలుకుతుందని స్పష్టం చేశారు. అక్రమ వలసలను అడ్డుకోవడంలో భాకంగా భద్రతా సిబ్బందికి అదనపు అధికారాలు కట్టబెడుతూ.. బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా సరిహద్దు రక్షణ, శరణు, వలసల బిల్లును తీసుకువస్తోంది.
అయితే బ్రిటన్కు అక్రమ మార్గాల్లో వలస వెళ్తున్న వారిలో భారతీయుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2023లో దాదాపు 1000 మంది భారతీయులు చిన్న చిన్న పడవలపై ప్రమాదకరమైన రీతిలో ఇంగ్లీష్ ఛానెల్ను దాటి బ్రిటన్లో అడుగుపెట్టినట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య 2022 కంటే రెట్టింపు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య తొలిసారి 2023లో 5 వేలు దాటినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa