బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా వేధించారన్న రైతు శ్రీనివాసులు ఫిర్యాదు చేసిన వెంటనే తన బోరుకు విద్యుత్ కనెక్షన్ వచ్చేలా చేసిన ప్రభుత్వానికి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని వెంకట్రాంపల్లి గ్రామ రైతు శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపాడు. 11 ఎకరాల్లో దానిమ్మ తోట వేశానని 48 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని చివరగా తన ఇంటి ముందు బోరు వేస్తే పుష్కలంగా నీళ్లు పడ్డాయని చెప్పారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని కొంతమంది ఓర్వలేక విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా వేధించారని తెలిపారు. ఈ తరుణంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని టీడీపీకి చెందిన కొందరు చెప్పారని.తాను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. అక్కడకు వెళ్లగానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన సమస్యను తెలుసుకుని జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. మరుసటి రోజు జిల్లా కలెక్టర్ ను కలిశానని సరిగ్గా నాలుగు రోజులకు బోర్ కనెక్షన్ కి విద్యుత్ లైన్ లాగడం ప్రారంభించారని చెప్పారు.తనను, తన కుటుంబాన్ని, తన పంటను కాపాడిన టీడీపీకి, సీఎం చంద్రబాబుకి, నారా లోకేశ్ కి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒక రైతు సమస్య తెలియగానే ఇంత స్పీడుగా స్పందించి రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే నా 60 ఏళ్ల వయసులో ఒక తెలుగుదేశం పార్టీని మాత్రమే అని కొనియాడారు.
![]() |
![]() |