వరి, మామిడి, అరటి పంట పొలాలపై ఏనుగుల గుంపు గురువారం అర్ధరాత్రి దాడి చేసింది. దీనితో రైతులకి భారీమొత్తంలో నష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని ఎగువ కంతల చెరువు గ్రామ సమీపంలో ఉన్న పొలాలపై ఏనుగుల గుంపు పడింది. గ్రామానికి చెందిన భాస్కర్ పొలంలో నీటి పైపులైన్లను ధ్వంసం చేశాయి. మునికృష్ణ, వెంకటే్షలకు చెందిన వరి పంటను తొక్కేశాయి. ఈశ్వరయ్య, ప్రకాష్, దేవేంద్ర, రాధలకు చెందిన మామిడి చెట్లను, కుమారస్వామికి చెందిన అరటి చెట్లను విరిచేశాయి. ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోయామని, పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉందని బాధిత రైతులు చెబుతున్నారు. అధికారులు తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
![]() |
![]() |