ఈ ఏడాది రబీ సీజన్లో కృష్ణా జిల్లా, నందిగామ సబ్ డివిజన్ పరిధిలో 8,500 ఎకరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు. కంచికచర్ల మండలంలోనే 6,500 ఎకరాల్లో పంట వేశారు. శనగ విత్తనాల ఖర్చు ఎకరానికి రూ.7 వేలు అయింది. కౌలుతో పాటుగా అంతరకృషి, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా కలిపి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. పైరు పూత, పిందె దశలో ఉన్నప్పుడు రెండు మూడురోజులు కొద్దిపాటి వర్షం కురిసింది. దీంతో పూత రాలిపోయింది. మళ్లీ పెద్దగా పూత రాలేదు. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. కొద్దిరోజుల నుంచి శనగ కోతలు ము మ్మరంగా సాగుతున్నాయి. కొంతమంది రైతులు కూలీలతో, మరికొంతమంది యంత్రాలతో కోయిస్తున్నారు. సాధారణంగా శనగ ఎకరానికి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈసారి ఐదారు క్వింటాళ్లకు మించి రావ డం లేదు. కొంతమంది రైతులకు మూడు నాలుగు క్వింటాళ్లే దిగుబడి వస్తోంది.శనగలు నిల్వ చేయటానికి ఎక్కువ మంది రైతులకు గిడ్డంగులు, తగిన వసతులు లేవు. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులకు తోడు గత సీజన్ పంట ఇంకా శీతల గిడ్డంగుల్లో మూలుగుతోంది. దీంతో పలువురు రైతులు పంట కోసిన వెంటనే కల్లాల్లోనే అమ్ముతున్నారు. కేంద్ర ప్రభు త్వం శనగలకు ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.5,650 ప్రస్తుతం బయటి మార్కెట్లో క్వింటాలు రూ. 5,500 పలుకుతోంది. మద్దతు ధర కంటే మార్కెట్ ధర రూ.150 తక్కువగా ఉంది. పండిన శనగలు నాణ్యంగా ఉండడంతో మున్ముందు ధర పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.దిగుబడి సగానికి సగం తగ్గడం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రావని రైతులు వాపోతున్నారు. పంట నూర్పిడి ఖర్చు భారంగా పరిణమించిందని, కూలీలతో నూర్పిడి ఎకరానికి రూ.5 వేలు, యంత్రంతో రూ.3 వేలు అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో శనగకు లభిస్తున్న ధర గిట్టుబాటు కాదని చెబుతున్నారు. మద్దతు ఽధర రూ.7 వేలకు తగ్గకుండా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa