ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఓ యువకుడు.. ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఎక్కడా అవకాశం దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అనుభవం లేదంటూ తిరస్కరణలను ఎదుర్కొన్న అతడు తన గోడును వెళ్లబోసుకోడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. సామాజిక మాధ్యమం వేదికగా తన రెజ్యుమేను షేర్ చేసిన యువకుడు.. మారుమూల లోకేషన్లో అయినా తనకు ఉద్యోగం ఇవ్వండి చాలు, జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ వేడుకున్నాడు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పోస్ట్కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
రెడ్డిట్లో రెజ్యుమేను పోస్ట్ చేసిన గ్రాడ్యుయేట్‘‘2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో బీఈ చేశాను.. ప్రస్తుతం ఉద్యోగ వేటలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాను.. నా రెజ్యుమేను తగులబెట్టేసినా పర్లేదు కానీ నాకు సాయం చేయండి.. వీలైనంత త్వరగా మారుమూల ప్రాంతంలో అయినా జీతం లేకుండా ఉచితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని వాపోయాడు. తనకు జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, ఏపీఐ, డాకర్, కుబేర్నెట్స్, తదితర వాటిలో ప్రావీణ్యం ఉందని చెప్పాడు. ఇలా చేయడం వల్ల కనీసం అనుభవమైనా వస్తుందని అన్నాడు.
ఈ పోస్టుపై స్పందించిన పలువురు.. అతడికి సలహాలు, సూచనలు చేశారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోమని సూచించారు. మరికొందరు మెయిల్ ద్వారా తమకు పంపాలని, ఆఫర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఇంకొందరు హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. అయితే, టెక్ పరిశ్రమలో ఒడిదొడుకులకు ఈ పోస్ట్ అద్దంపడుతోంది.
పది రోజుల కిందట దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లోని 700 మందిని సామూహికంగా తొలగించడంపై కలకలం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేయడంతో కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఇదో ఉదాహరణ. ఏటా లక్షల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా.. కొంత మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa