ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్‌పై అవగాహన కల్పించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:15 AM

క్యాన్సర్‌ పట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండి దానిని జయించేందుకు కృషిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడులో ఏర్పాటుచేసిన క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 155మంది సూపర్‌ స్పెషలిస్టులతోపాటు 238మంది స్పెషలిస్టులు, 4వేల మంది వైద్యాధికారులు, 4వేల మంది ఏఎన్‌ఎంలు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. వీరితోపాటు 18వేల మంది పీహెచ్‌సీ సిబ్బంది కూడా సేవలందిస్తారని చెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కువమంది మృత్యువాత పడుతున్నారన్నారు. వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స పొందితే బయటపడే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్‌ ప్రాథమిక పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు. స్టెమీ కార్యక్రమంలో భాగంగా గుండెపోటు నివారణకు రూ.45వేలు విలువైన ఇంజెక్షన్‌ ప్రభుత్వం ఉచితంగా చేస్తుందన్నారు. ప్రతి సామాజిక కేంద్రంలో ఇంజెక్షన్‌ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సినీనటి, లైఫ్‌ ఎగైన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు గౌతమి హాజరై క్యాన్సర్‌ గురించి స్వీయ అనుభవాలను వివరించారు. అవగాహన ఉంటే క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చన్న సంగతి తన విషయంలోనే రుజువైందన్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకిన తాను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల 20 ఏళ్ల క్రితం మహమ్మారి నుంచి తాను బయటపడగలిగాన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa