2024 ఏడాదికి సంబంధించి.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించి.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఇవాళ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ.. దేశంలోని ఐదు రాష్ట్రాలకు అదనపు విపత్తు సాయాన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆ 5 రాష్ట్రాల కోసం రూ.1554.99 కోట్ల నిధులను విడుదల చేసింది. గతేడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో విపత్తులు సంభవించాయి. ఇందుకుగానూ నరేంద్ర మోదీ సర్కార్ ఆయా రాష్ట్రాలకు విపత్తు సాయం అందించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవించడం.. కొండ చరియలు విరిగిపడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన ఒడిశా, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు కలిపి మొత్తంగా ఈ రూ.1554.99 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఆంధ్రప్రదేశ్కు రూ.608.08 కోట్లు.. తెలంగాణకు రూ.231.75 కోట్లు అందనున్నాయి. భారీ వర్షాల కారణంగా గతేడాది విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి.
మరోవైపు.. త్రిపుర రాష్ట్రానికి రూ.288.93 కోట్లు.. ఒడిశాకు రూ.255.24 కోట్లు.. నాగాలాండ్కు రూ.170.99 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక గతేడాది వరదలు, విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేయగా.. తాజాగా వాటికి అదనంగా మరికొన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించి.. నివేదికలు ఇవ్వగా తాజాగా మరో ఐదు రాష్ట్రాలకు అదనంగా నిధులను కేటాయించింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్లో భాగంగా 27 రాష్ట్రాలకు రూ.18,322.80 కోట్లు విడుదల చేసింది. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ కింద 18 రాష్ట్రాలకు రూ.4,808.30 కోట్లను మంజూరు చేసింది.
![]() |
![]() |