ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు సాంకేతికత సాయం,,,నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 07:35 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మాసాలతో సంబంధం లేకుండా శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో తిరుమల కొండకు వస్తుంటారు. ఇక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వంటి రోజుల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంటుంది. భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అయితే తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు సాంకేతికత సాయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం నారా లోకేష్ తిరుపతిలో పర్యటించారు. ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొ్న్నారు.


ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో టికెట్‌ బుకింగ్‌, ఆలయ సర్వీసులు మరింత సరళతరం చేస్తామని నారా లోకేష్ వివరించారు. ఆన్‌లైన్‌ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయన్న నారా లోకేష్.. ఆలయాలలో భక్తుల సౌకర్యాలపై మరింత మెరుగుపరుస్తామన్నారు. అలాగే తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించే అంశమై చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వివరించారు. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమను ఆదేశించినట్లు నారా లోకేష్ తెలిపారు.


తిరుపతి కపిలతీర్థంలోని కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధ‌వారం ఉదయం ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణ, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలను అర్చకులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం నాడు మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేయటం ఆనవాయితీ. అభిషేకం తర్వాత దీపారాధన.. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం, రాత్రి వాహనసేవలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com