హైదరాబాద్ కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుషాయిగూడ బస్ డిపోలో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో రెండు ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం (ఫ్రిబ్రవరి 18) రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాకపోవటంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు ఎలా వ్యాపించాయి..? జరిగిన ఆస్తినష్టంపై ఆర్టీసీ అధికారులు నేడు విచారణ జరపనున్నారు.
కాగా, ఈనెల ఈ నెల ప్రారంభంలోనూ హైదరాబాద్ మదీనాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అబ్బాస్ టవర్స్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అక్కడ దాదాపు 200 వరకు వస్త్ర దుకాణాలు ఉన్నాయి. అబ్బాస్ టవర్స్ ఫోర్త్ ఫ్లోర్లోని ఓ దుకాణంలో ప్రారంభమైన మంటలు.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. షాపుల్లో దుస్తులు, బెడ్ షీట్లు, కార్పెట్లు వంటి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు.
గత వారం క్రితం హైదరాబాద్ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పుఖాన్ వంతెన సమీపంలో రన్నింగ్లో ఉన్న కారు మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ.. కారు నడుపుతున్న వ్యక్తి అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. వెంటనే డ్రైవర్ కారు నుండి బయటకు దిగేశాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇలా వరుస అగ్ని ప్రమాద ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రానున్నది ఎండా కాలం కావటంతో అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa