భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్లు (రూ.187 కోట్లు) ఆర్ధి సాయాన్ని ఇటీవల యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. సంచలన వాఖ్యలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోడానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నించారంటూ పరోక్షంగా ఆరోపించారు.
మియామీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మరోసారి ఈ నిధుల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి మనం ఎందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి? బహుశా మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వం) ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. దీని గురించి భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి.. అదే కీలక ముందడుగు అవుతుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ నిధుల రద్దు అంశంపై దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
రెండు రోజుల కిందట కూడా ఈ నిధుల రద్దు గురించి మాట్లాడారు. ‘‘భారత్కు మనమెందుకు 21 మిలియన్ డాలర్లు (రూ.187 కోట్లు) ఇవ్వాలి. వాళ్లదగ్గరే బోల్డంత డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోన్న దేశాల్లో అది ఒకటి. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను అందుకోలేదు... నాకు భారతీయులు, ఆ దేశ ప్రధాని మోదీపై చాలా గౌరవం ఉంది. కానీ, వారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి డబ్బులు ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది..?’’ అని ట్రంప్ ప్రశ్నించారు.
యూఎస్ఎఐడీ ద్వారా పలు దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అమెరికా నిధులు అందజేస్తోంది. అయితే, ఇదో నేర సంస్థ అని, రాడికల్స్ దీన్ని నడుపుతున్నారంటూ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్లు ఆరోపిస్తూ ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధించారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. వీటితో బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం కోసం 29 మిలియన్ డాలర్లు, నేపాల్లో జీవివైవిధ్యం కోసం కేటాయించిన 39 మిలియన్ డాలర్లను నిలిపివేశారు.
డోజ్ నిర్ణయంపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయా స్పందిస్తూ.. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యమేనని, ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? కచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదని తెలిపారు. 2012లో భారత ఎన్నికల సంఘం అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న ఎస్వై ఖురేషీ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa