ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా- పాక్ మ్యాచ్‌కు సెలబ్రిటీల క్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 08:03 PM

ఐసీసీ టోర్నీలంటే క్రికెట్ ప్రేమికులకు పండగే. అందులోనూ ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అంటే చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నీల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉందా అని అందరి కల్లు ఆసక్తిగా వెతుకుతుంటాయి. ఇక మ్యాచ్ ఉందని తెలియగానే క్రికెట్ ప్రేమికులు రెక్కలు కట్టుకుని మరీ అక్కడ వాలిపోతారు. వేదిక ఏదైనా, ఎంత దూరమైనా, ఖర్చు ఎంతైనా, టికెట్ సంపాదించడం ఎంత కష్టమైనా క్రికెట్ లవర్స్ అవన్నీ పట్టించుకోరు. మ్యాచ్ చూసి తీరాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అందులోనూ సెలబ్రిటీల తాకిడి కూడా అధికంగానే ఉంది.


దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. ఈ క్రమంలోనే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి దుబాయ్ స్టేడియంలో నారా లోకేష్ సందడి చేశారు. టీమిండియా జెర్సీలు ధరించి నారా లోకేష్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్, కేశినేని చిన్ని, సుకుమార్‌తో పాటుగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా ఉన్నారు.


మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో సందడి చేశారు. టీమిండియా క్రికెటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మతో కలిసి మ్యాచ్ చూస్తూ కనిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 241 పరుగులకు ఆలౌటైంది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాకిస్థాన్ ఆలౌటైంది. సౌద్ షకీల్ 62 , మహ్మద్ రిజ్వాన్‌ 46 పరుగులతో రాణించారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాకిస్థాన్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే టీమిండియా బౌలర్ల ఆఖరి 20 ఓవర్లలో పుంజుకోవటంతో పాకిస్థాన్ మరో రెండు బాల్స్ ఉండగానే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యకు రెండు వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాకు తలా వికెట్ దక్కగా.. షమీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa