ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సౌర విద్యుత్ అందించనుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు చెందిన 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు పీఎం సూర్యఘర్ పథకం అమలు చేయనున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 20 లక్షల కనెక్షన్లకు ఉచితంగా సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల పలకలు ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారులపై భారం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికి తోడు సౌర పలకలు ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వమే ప్రతి నెలా కొంత మొత్తాన్ని లీజు రూపంలో చెల్లించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విధివిధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పీఎం సూర్యఘర్ పథకం విధివిధానాలు
పీఎం సూర్యఘర్ పథకం ఎస్టీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన 20 లక్షల కనెక్షన్ల ఇళ్లపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తారు. అలాగే ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నందుకు గానూ చదరపు అడుగుకు రూపాయి చొప్పున ప్రభుత్వం వారికి లీజు చెల్లించనుంది. ఒక్కో ఇంటిపై ప్యానెళ్లు ఏర్పాటు చేయడానికి 200 చదరపు అడుగులు అవసరమవుతాయని అంచనా. ఆ లెక్కన 200 చదరపు అడుగులకు 200 రూపాయలు ప్రభుత్వం లీజు చెల్లిస్తుంది.
అయితే నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 7.7 లక్షల వినియోగదారుల ఇళ్ల మీద రూఫ్టాప్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. ఈ రూఫ్టాప్ ప్రాజెక్టుల ద్వారా 1,550 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూఫ్టాప్ ఫలకలు, వర్చువల్ నెట్ మీటరు ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది.. అలాగే స్మార్ట్ మీటర్ ధర కూడా ప్రాజెక్టు వ్యయంలో కలిసి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సుమారుగా 21.10 లక్షల కుటుంబాలు ఈ ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనం పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఉచిత విద్యుత్ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. అయితే ఈ కుటుంబాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఉచిత విద్యుత్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు నిధులు చెల్లిస్తూ వస్తోంది. అయితే రాష్ట్రం చెల్లించే ఈ మొత్తాన్ని డిస్కం రుణంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ప్రాజెక్టు అమలు చేస్తాయి. డిస్కంలు తీసుకున్న రుణం వాయిదాను ప్రతి నెలా ప్రభుత్వం చెల్లిస్తుందని విధివిధానాల్లో పేర్కొన్నారు.
పథకంలో భాగంగా ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసే సంస్థలకు 12 ఏళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. అందులో ఐదేళ్లు ఉచితంగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్టులను డిస్కంలకు అప్పగించాలి. అలాగే ప్రాజెక్టు వ్యయాన్ని కాంట్రాక్టర్కు ప్రభుత్వం ఐదేళ్ల పాటు విడతల వారీగా చెల్లిస్తుంది. మొదటి ఏడాదిలో 75 శాతం, రెండో సంవత్సరం 10 శాతం, మిగిలిన దానిని ఏటా 5 శాతం చొప్పున మూడేళ్లలో చెల్లిస్తుందని ప్రభుత్వం విధివిధానాల్లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa