ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు షాక్‌.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్‌

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 11:49 PM

సుమారు 30 ఏళ్ల విరామం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్రోఫీలో పాకిస్థాన్‌ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగిన పాకిస్థాన్.. నాకౌట్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. టైటిల్ మాట పక్కనబెడితే.. కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి.. చేజేతులా సెమీస్ అవకాశాలను పోగొట్టుకుంది. సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించడంతో పాకిస్థాన్.. నిష్క్రమణ ఖరారైంది.


కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగాయి. అందులో గ్రూప్‌-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు కూడా మిగతా మూడు మ్యాచ్‌లతో ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి. అయితే పాకిస్థాన్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది.


మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్, న్యూజిలాండ్ జట్లు గెలిచాయి. దీంతో ఈ రెండు జట్లూ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో తన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినా.. ఆ జట్టు ఖాతాలో ఒక విజయం, రెండు పాయింట్లు మాత్రమే చేరతాయి. దీంతో ఆ జట్టు టాప్‌-2లో నిలిచేందుకు ఏమాత్రం ఛాన్స్ లేదు.


సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు. దీంతో న్యూజిలాండ్ ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.


ఈ ఫలితంతో గ్రూప్‌-ఏ నుంచి టాప్‌-2 జట్లేవో ఖరారయ్యాయి. అయితే ఎవరు తొలిస్థానం, ఎవరు రెండోస్థానంలో ఉంటారనేది తేలాల్సి ఉంది. మార్చి 2న జరిగే భారత్‌-న్యూజిలాండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచి.. లీగ్ దశను ముగిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa