ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాలా బాగా ఆడుతున్నావంటూ అభిషేక్‌ శర్మకు వసీం అక్రమ్ కితాబు

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 11:12 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు అటు పాకిస్తాన్, ఇటు భారత్‌కి చెందిన క్రికెటర్లు ఎందరో హాజరయ్యారు. టీమిండియా టీ20 క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ స్టేడియంలో సందడి చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ లెజండ్రీ బౌలర్, ప్రస్తుత కామెంట్రేటర్ వసీం అక్రమ్ అటుగా వెళ్తూ అభిషేక్ శర్మతో నిలబడి కాసేపు మాట్లాడాడు.


"నేను నీ ఇన్నింగ్స్‌లు చూశా. చాలా బాగా బ్యాటింగ్ ఆడుతున్నావు. అదే ఫామ్‌ని కొనసాగించు. ముఖ్యంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండు. ఎప్పుడూ తల కిందకు వంచుకుని మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఓకే బేటా.. ఆల్ ది బెస్ట్" అంటూ వసీం అక్రమ్ అభిషేక్ శర్మ భుజం తట్టి వెళ్లిపోయాడు.


ఐపీఎల్‌తో హీరో


ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)తో అభిషేక్ శర్మ టీమిండియాలో స్థానం సాధించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీతో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ 2018లో ఆ జట్టుకు ఆడాడు. అభిషేక్ తన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 46 పరుగులు బాదాడు.


ఐపీఎల్ 2019 నుంచి ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీతోనే కలిసి ప్రయాణిస్తున్నాడు. తొలుత మిడిలార్డర్‌లో ఆడిన అభిషేక్ ఇప్పుడు ఓపెనర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్‌తో కలిసి సన్‌రైజర్స్‌కు భారీ స్కోర్‌ను అందించాడు. దాంతో బీసీసీఐ సెలక్టర్లు అభిషేక్ శర్మకు టీ20ల్లో అవకాశం ఇచ్చారు. 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 75 హైయెస్ట్‌తో 1376 పరుగులు చేశాడు.


టీ20 ఇంటర్నేషనల్


టీ20 ఇంటర్నేషనల్‌లో అడుగుపెట్టిన తొలి సిరీస్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. 2024లో జింబాబ్వేతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మరో సెంచరీతో మెరిశాడు. 17 టీ20లు ఆడిన అభిషేక్ శర్మ 135 బెస్ట్‌తో 535 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. అదేవిధంగా 11 వికెట్లు కూడా తీసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa