పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ర్టైక్ రేట్ తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. హోలీ పండగ నాడు నిర్వహిస్తోన్న ఈ సభను పండగ వాతావరణంలో జరుపుకొందామని చెప్పారు. సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేనే అనుకునేట్టుగా మనందరం కలిసి పని చేద్దామని అన్నారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు... సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో నాదెండ్ల మనోహర్ నేడు కాకినాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఎన్నో కష్టనష్టాలు, అటుపోటులను తట్టుకొని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారు. ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎనాడూ కూడా రాజకీయ లబ్ధి కోసం ఆయన పని చేయలేదు. మానవత్వం, నిజాయతీతో కూడిన విలువైన ప్రయాణం మాత్రమే చేశారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా వంద శాతం స్టైక్ రేట్ తో ఈ రోజు మనం విజయం సాధించాం. పోటీ చేసిన 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం" అని వివరించారు. పొత్తు నిలబెట్టడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. బీజేపీ కోసం తన సీట్లను త్యాగం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ ను నిరసిస్తూ పరామర్శించడానికి వస్తుంటే ఆయన విమానం టేకాఫ్ కాకుండా చేశారు. రోడ్డు మార్గంలో వస్తే బోర్డర్ లో పోలీసులు అడ్డుకున్నారు. జోరు వానలో జన సైనికులు, వీర మహిళలు ఆయనకు ఎంత అండగా నిలబడ్డారో ఆనాడు మనం చూశాం. రాష్ట్ర రాజకీయాల్లో అదే టర్నింగ్ పాయింట్. అది ఎవరూ మరిచిపోకూడదు. చంద్రబాబు గారిని పరామర్శించిన అనంతరం పొత్తుపై ప్రకటన చేశారు. బీజేపీని ఒప్పించి కూటమి కట్టడానికి కారకుడయ్యారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మనందరం ఆయన వెనుక నడవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇగోలు పక్కన పెట్టి మనందరం కలిసి పనిచేయాలి. చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటే మనం మాట్లాడుకుంటే సమసిపోతాయి. కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమానమే. ఒకరు ఎక్కువ... ఇంకొకరు తక్కువ కాదు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా మనందరికీ ఆకాంక్షలు ఉంటాయి. చిన్న చిన్న పదవులు ఆశిస్తాం. అధ్యక్షులు దృష్టిలో అన్ని ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa