తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీ భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియలో టీటీడీ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. తిరుమలలో గదుల కేటాయింపు ప్రక్రియలో ఈ మేరకు టీటీడీ కొత్తగా మార్పులు చేసింది. శ్రీవారి దర్శనం టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే తిరుమలలో ఇకపై గదులు కేటాయించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం.. తిరుమల కొండపై అనేక గదులు అందుబాటులో ఉంచింది. సుమారుగా 7500 వరకూ గదులు తిరుమలలో ఉన్నాయి. వీటిలో 3500 గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తూ ఉన్నారు. సీఆర్వో పరిధిలో ఉన్న ఈ గదులను ఆధార్ కార్డు ద్వారా సామాన్య భక్తులకు కరెంట్ బుకింగ్ కింద కేటాయిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కింద మరో 1,580 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు.. మరో 400 గదులను విరాళాలు అందించే దాతల కోసం టీటీడీ కేటాయిస్తోంది. మరో 450 గదులను అరైవల్ కింద భక్తులకు కేటాయిస్తున్నారు. మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీల కోసం అందుబాటులో ఉంచారు.
అయితే వీఐపీలకు కేటాయించిన గదులను గతంలో దళారీలు దుర్వినియోగం చేసేవారు. ఆధార్ కార్డుల ద్వారా పెద్దఎత్తున గదులను తీసుకుని.. దళారీలు వారి ఆధీనంలో ఉంచుకునేవారు. ఒక సారి గదిని పొందితే 48 గంటల వరకూ వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో.. ఒక్కో రోజు ఒక్కో భక్తుడికి చొప్పున, ఇద్దరు లేదా ముగ్గురు భక్తులకు దళారీలు ఈ వీఐపీ గదులను ఇస్తూ సొమ్ము చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని టీటీడీ మార్చింది. కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. కొత్త విధానం ప్రకారం తిరుమలలో వసతి గదులు పొందాలంటే వీఐపీ భక్తులకు దర్శన టికెట్ తప్పనిసరి. ఆధార్ కార్డుతో పాటుగా శ్రీవారి దర్శనం టికెట్ చూపించి పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో వీటిని పొందేందుకు అవకాశం కల్పించారు.
దర్శనం టికెట్ ఉన్న వీఐపీ భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తూ ఉండటంతో... దర్శనం పూర్తి కాగానే భక్తులు గదులను ఖాళీ చేస్తున్నారు. దీంతో అరగంటలోపే ఆ గదులను మరో భక్తులకు కేటాయించడానికి వీలు కలుగుతోంది. దీని ద్వారా దళారీల అక్రమార్జనకు చెక్ పెట్టడమే కాకుండా.. టీటీడీ ఆదాయం సైతం పెరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారిని శనివారం 71,785 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,481 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీకి శనివారం 2.84 కోట్ల ఆదాయం వచ్చింది. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పట్టినట్లు టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa