ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7 రాష్ట్రాల సీఎంలతో జేఏసీ ఏర్పాటు..డీలిమిటేషన్‌పై కేంద్రంతో స్టాలిన్ యుద్ధం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 07:27 PM

డీలిమిటేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న యుద్ధాన్ని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మరింత ఉద్ధృతం చేశారు. ఈ విషయంలో తమతో కలిసి రావాలని దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పెంపు జరిగితే.. గతంలో జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిపోతోందని గత కొన్ని రోజులుగా ఎంకే స్టాలిన్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో స్టాలిన్‌కు కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో ఆ రాష్ట్రాలను కలుపుకుని పోరాటం చేయాలని నిర్ణయించారు.


ఇటీవల తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 67 పార్టీల నేతలు హాజరై.. ఒక తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఆ అఖిలపక్ష తీర్మానం ఆధారంగానే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఆ అఖిలపక్ష తీర్మానాన్ని పంపించినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ అంశంపై సమష్టి కార్యాచరణ కోసం మార్చి 22వ తేదీన చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఆ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎంకే స్టాలిన్ కోరారు. అలాగే ఆ 7 రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ-జేఏసీ ఏర్పాటు చేద్దామని వారికి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.


నియోజకవర్గాల పునర్విభజన అనేది సమాఖ్యవాదంపై కేంద్రం చేస్తున్న దాడి అని.. దీనివల్ల పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల హక్కులకు కోత విధించి.. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు శిక్ష విధించడమే అవుతుందని ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ అన్యాయాన్ని తాము సహించబోమని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం 2026లో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.


 గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా అమలు చేశాయని.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం భారీగా జనాభా పెరిగిపోవడంతో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే.. దక్షిణాది కంటే ఉత్తరాదిన భారీగా ఎంపీ సీట్లు పెరిగి.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1971 జనాభా లెక్కల ప్రకారం.. పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న నిష్పత్తి మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డీఎంకే డిమాండ్‌ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa