ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోసానికి మరో షాక్.. రిమాండ్ విధించిన కోర్టు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 05:42 PM

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. పోసాని కృష్ణ మురళికి విజయవాడ కోర్టు మార్చి 20 వరకు రిమాండ్‌ విధించింది. పీటీ వారెంట్‌ మీద విజయవాడలోని భవానీపురం పోలీసులు పోసాని కృష్ణ మురళిని.. శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణ మురళిని హాజరుపరచగా.. కోర్టు మార్చి 20 వరకూ రిమాండ్ విధించింది. దీంతో పోసానిని విజయవాడ జైలుకు తరలించనున్నారు.


మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, వారి కుటుంబసభ్యులపై దూషణలు, అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై జనసేన నేత శంకర్‌.. పోసాని కృష్ణ మురళిపైవిజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భవానీపురం పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్ జారీ చేశారు. అనంతరం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళిని.. విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది.


మరోవైపు తనపై అక్రమ కేసులు పెట్టారంటూ విజయవాడ సీఎంఎం కోర్టులో పోసాని కృష్ణ మురళి వాపోయారు. ఒకే రకమైన కేసులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని న్యాయాధికారికి తెలియజేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని.. గుండె జబ్బు, పక్షవాతం లాంటి సమస్యలు ఉన్నాయని పోసాని కృష్ణ మురళి కోర్టుకు తెలియజేశారు. అనంతరం కోర్టు మార్చి 20వ తేదీ వరకూ రిమాండ్ విధించింది.


మరోవైపు పోసాని కృష్ణ మురళికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నాలుగు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa