మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై ఇటీవల తెరకెక్కిన చిత్రం ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పోషించారు. అయితే ఈ సినిమా హిందీలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా.. మరిన్ని భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ సినిమాలో చూపించిన ఒక సీన్ ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది. అందులో ఒక కోట వద్ద గుప్త నిధులు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు అంతా ఆ సినిమా చూసి వచ్చి.. ఆ కోట వద్దకు చేరుకుంటున్నారు. రాత్రి పూట గుప్త నిధుల కోసం వేట కొనసాగిస్తున్నారు. టార్చ్లైట్లు, మెటల్ డిటెక్టర్లతో సమీప గ్రామాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు గాలింపు చేపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్లో ఇప్పుడు ఈ గుప్త నిధుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
రాత్రి అయిందంటే చాలు ఎక్కడెక్కడి నుంచో టార్చ్లైట్లు వేసుకుని వచ్చి తవ్వకాలు జరుపుతున్నారు. జల్లెడలు, మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి.. ఎవరికి వారే తమకు బంగారం, వెండి నాణేలు దొరికాయని చెబుతున్నారు. బుర్హన్పూర్లోని అసిర్గఢ్ కోట వద్దకు భారీగా జనాలు తరలివచ్చి.. వేట కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో బంగారం గనులున్నాయంటూ ఛావా సినిమాలో పేర్కొనడమే ఈ గుప్త నిధుల ప్రచారానికి కారణం అయింది. అయితే స్థానికంగా జాతీయ రహదారులు నిర్మిస్తుండగా.. ఆ నిర్మాణ పనుల్లో భాగంగా దర్గా సమీపంలో జేసీబీ సాయంతో మట్టిని తవ్వేశారు.
అయితే తవ్వేసిన మట్టిని అసిర్గఢ్ కోట ఉన్న గ్రామ సమీపంలో పోశారు. అయితే స్థానికులు ఆ మట్టిలో పురాతన నాణేలను గుర్తించగా.. అవి మొఘలుల కాలం నాటి బంగారం, వెండి నాణేలు అనే ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అది విన్న పరిసర గ్రామాల ప్రజలు గుప్తనిధుల వేటను ప్రారంభించారు. ఛావా చిత్రంలో మొఘలుల కాలంలో ఆ బుర్హన్పూర్ ప్రాంతం ఛత్రపతి శంభాజీ మహారాజ్ మిలటరీ క్యాంప్గా ఉండేదని.. అక్కడ బంగారం గనులు ఉండేవనే ప్రచారం జరగడంతో భారీగా జనాలు అక్కడికి చేరుకోవడం ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలోనే రాత్రి అయిందంటే చాలు ఆ ప్రాంతానికి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తవ్వకాలు చేస్తున్నారు. వారిలో కొంతమందికి నాణేలు దొరకుతుండటంతో రోజు రోజుకూ తవ్వకాలు జరిపేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పట్వారీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు. మొఘలుల కాలంలో బుర్హన్పూర్ ఒక సంపన్న నగరం అని చరిత్రకారులు చెబుతుండటం గమనార్హం.
యుద్ధం సమయంలో స్థానికులు తమ సంపదను అక్కడ పూడ్చిపెట్టేవారని పేర్కొంటున్నారు. అందుకే ఎవరైనా తవ్వకాలు జరిపితే నాణేలు దొరికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు అనధికారికంగా తవ్వడం వల్ల విలువైన చారిత్రక సంపదకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చరిత్రకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీస్ యంత్రాంగం అనధికారిక తవ్వకాలపై దృష్టి సారించింది. ఏవైనా ఫిర్యాదులు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని బుర్హన్పుర్ ఎస్పీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa