ఢిల్లీలో ఇటీవలె బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అర్హులైన మహిళలకు ప్రతీ నెల రూ.2500 ఆర్థిక సహాయం చేసే మహిళా సమృద్ధి యోజనను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళా సమృద్ధి యోజనకు ఢిల్లీ మంత్రి వర్గం ఆమోద ముద్ర కల్పించింది. ఎన్నికల హామీ ప్రకారం మహిళా సమృద్ధి యోజనను త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టం చేశారు. ఈ మహిళా సమృద్ధి యోజనకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్న సీఎం రేఖా గుప్తా.. ఢిల్లీలో ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయం చేసే మహిళా సమృద్ధి పథకాన్ని ఆమోదించినట్లు చెప్పారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తన అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీలో తనతోపాటు అశీష్ సూద్, పర్వే్ష్ వర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు ఉన్నట్లు తెలిపారు. ఈ మహిళా సమృద్ధి యోజన కింద అర్హులైన మహిళలు పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు.. ఢిల్లీలో మహిళలకు ఆర్థిక సాయం అందించే మహిళా సమృద్ధి యోజనకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం కల్పించిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా కూడా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని చెప్పగా.. దాని కంటే ఎక్కువగా రూ.2500 ఇస్తామని కమలం పార్టీ చెప్పింది. ఆ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా.. ఆప్ కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa