ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్. అయితే ఈ ఐపీఎల్ సృష్టికర్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మాత్రం ఇప్పుడు భారత్ నుంచి పారిపోయి.. విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీల విషయంలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డాడని లలిత్ మోదీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తగా ఆయన లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి లలిత్ మోదీని భారత్కు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లలిత్ మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పసిఫిక్ ద్వీప దేశం అయిన వనౌటూ పౌరసత్వాన్ని లలిత్ మోదీ పొందాడు. ఈ క్రమంలోనే భారత పాస్పోర్టును లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయంలో అప్పగించనున్నట్లు పేర్కొన్నాడు.
దీంతో అసలు ఈ వనౌటు దేశం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. సుమారు 80 ద్వీపాల సమూహం అయిన వనౌటూ గురించి, ఆ దేశ ప్రత్యేకతల గురించి నెటిజన్లు ఆన్లైన్లో తెగ ఆరా తీస్తున్నారు. భారత పాస్పోర్టును అప్పగించడానికి ముందే.. లలిత్ మోదీ వనౌటూ పౌరసత్వం పొందినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు తీసుకునే వనౌటు గోల్డెన్ పాస్పోర్ట్ కార్యక్రమం కింద ఆ దేశ పౌరసత్వాన్ని లలిత్ మోదీ పొందినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం.. తిరిగి లలిత్ మోదీని స్వదేశానికి రప్పించి.. ఐపీఎల్ స్కామ్పై దర్యాప్తు చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. దాన్ని తప్పించుకునేందుకే ఆయన ఈ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆస్ట్రియన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్ట్ కార్యాలయ అధిపతి జ్లాటా ఎర్లాచ్.. వనౌటూ పౌరసత్వం తీసుకున్నవారికి దక్కే ప్రయోజనాలు వెల్లడించారు. వనౌటూ పౌరసత్వం తీసుకున్న వారికి.. ఆ దేశంలో గానీ, ఇతర దేశాల నుంచి గానీ వచ్చే ఆదాయంపై ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంతేకాకుండా ఆదాయంపై వచ్చే దీర్ఘకాలిక లాభాలపైనా ఎలాంటి పన్ను విధించరు. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి ఈ వనౌటూ సిటిజెన్షిప్ అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వీటన్నింటితోపాటు వనౌటూ దేశంలో వారసత్వ పన్ను, కార్పొరేట్ పన్నులు ఉండవు. వనౌటు దేశంలో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకుని.. విదేశాల నుంచి ఆదాయాన్ని పొందినా.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్లు కూడా విధించరు. అంతేకాకుండా వనౌటూ దేశం ఇప్పుడు క్రిప్టో హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇక 2024లో విడుదలైన హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్లో వనౌటు దేశం అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa