ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊబకాయంతో బాధపడేవారికి ప్రధాని మోదీ సూచన

national |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 07:36 PM

దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని హితవు పలికారు. ఈ ఊబకాయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రధాని మోదీ.. 10 మంది సెలబ్రిటీలను నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఊబకాయం తగ్గించుకోవడం గురించి సూచనలు చేశారు. అనేక రకాల వ్యాధులకు ఊబకాయమే ప్రధాన కారణమేనని పేర్కొన్న ప్రధాని మోదీ.. వ్యాయామం, సైక్లింగ్‌ వంటివి చేయడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.


రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేయడం, సైక్లింగ్‌ చేయడం, వంటనూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతం.. దాద్రా నగర్‌ హవేలీలోని సిల్‌వాసాలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో మన జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులతో మన ఆరోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. అందులో ఊబకాయం అనేది ఒకటని పేర్కొన్నారు. ఈ ఊబకాయమే అనేక రోగాలకు మూలకారణమని చెప్పారు.


2050 నాటికి భారతదేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య 44 కోట్లకు చేరుతుందని ఒక నివేదిక చెప్పిందని.. ఇది చాలా పెద్ద సంఖ్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ నివేదిక గనక నిజమైతే.. దేశంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడతారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఇప్పటి నుంచే దేశప్రజలు తమ ప్రయత్నాన్ని ప్రారంభించాలని సూచించారు. అందుకే వంటనూనెల వాడకాన్ని 10 శాతం తగ్గించాలని గతంలోనే సూచించినట్లు గుర్తు చేసిన ప్రధాని మోదీ.. వంటనూనెల కొనుగోలును 10 శాతం తగ్గిస్తామంటూ ప్రతీ ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా జన ఔషధి కేంద్రాల గురించి కూడా ప్రధాని మోదీ వెల్లడించారు. దేశప్రజలకు చౌకధరల్లో మందులను అందించేందుకు దేశవ్యాప్తంగా కొత్తగా మరో 25 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు రూ.30 వేల కోట్లు ఆదా అయినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa