కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై.. షిండే శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఈ నెల 6వ తేదీన ముంబైలోని ధారావి ప్రాంతాలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడకు రాహుల్ గాంధీ ఓ కాంగ్రెస్ నాయకుడిలా వచ్చినట్లు తనకు ఏమాత్రం అనిపించలేదని.. కేవలం యూట్యూబర్లా వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయినట్లు అనిపించిందని శివసేన నాయకుడు విమర్శించారు. ఆ పూర్తి వవరాలు మీకోసం.
రాహుల్ గాంధీ ధారావి యాత్రను పరిశీలిస్తే.. ప్రతీ ఒక్కరికీ ఆయన అక్కడకు కాంగ్రెస్ నాయకుడిగా వచ్చినట్లు అనిపించదని, యూట్యూబర్గానే వచ్చి సందర్శించి వెళ్లిపోయినట్లు కనిపిస్తుందన్నారు. తాను ధారావికి వచ్చినట్లు కొన్ని వీడియోలు తీయించుకుని వచ్చిన పని అయిపోయిందంటూ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాళా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అగ్రనేత స్థానిక నేతలను ఎవరినీ కలవకుండానే వెళ్లిపోయారని విమర్శించారు.
ముంబైలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చాలా నెలలుగా అద్దె కూడా చెల్లించట్లేదని చెప్పారు. దాంతో పాటు పార్టీ కార్యాలయానికి సుమారు రూ.5 లక్షల కరెంటు బిల్లు కూడా చెల్లించాల్సి ఉందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో తాను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్గా నాలుగేళ్ల పాటు పని చేసినట్లు గుర్తు చేసిన నిరుపమ్.. ఏనాడు ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవని చెప్పుకొచ్చారు.
బాల్థాక్రేను ఆదర్శంగా తీసుకుని సంజయ్ నిరుపమ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎంపీగా కూడా పని చేశారు. అయితే గతేడాది ఏప్రిల్లో క్రమశిక్షణ చర్యల కిద కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆయనపై ఆరేళ్పాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి షిండే శివసేన వర్గంలో చేరారు.
ఈ నెల 6వ తేదీన ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ, స్థానిక తోలు పరిశ్రమ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇతర స్థానిక పరిశ్రమల కార్మికులతోనూ ముచ్చటించారు. ముంబైలోని ధారావి మురికివాడలను అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ దాని కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. అదానీ గ్రూప్ ఈ నిర్మాణ పనుల టెండర్ను దక్కించుకుని పనులు మొదలు పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa