ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్ల్యూపీఎల్ లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 11:54 AM

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ జట్టుతో ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విమెన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ చేసిన 31 పరుగులే అత్యధికం. భాటి ఫుల్మాలి 30 పరుగులు చేసింది. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టగా, అమెలియా కెర్ 2 వికెట్లు తీసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు చెలరేగిపోయింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, నట్ స్కివర్ బ్రంట్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. 12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు చేసింది.  ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న హేలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 47 పరుగులతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రేపు ఢిల్లీ కేపిటల్స్‌తో ఫైనల్‌లో తలపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com