యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇంత వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. మంగళవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్లపై ఆయన మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదని ఫైర్ అయ్యారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్ లు ఉన్నాయని, కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయని చెప్పారు. ఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ...ఎన్ని తొలగించారని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మంది పెన్షన్లు తగ్గించారని విమర్శించారు. బడ్జెట్ లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదని తప్పుపట్టారు. 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా.. లేదా అని నిలదీశారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇజ్రాయల్ డిమాండ్ చేశారు.
![]() |
![]() |