రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దేశంలో పేరెన్నికగన్న బిట్స్ ను అమరావతిలో ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ సవరణ బిల్లు-2025ను మంత్రి నారా లోకేశ్ శాసనసభలో ప్రవేశపెడుతూ... దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. వివిధ ఫారిన్ వర్సిటీల క్యాంపస్ లను రాష్ట్రానికి రప్పించాలన్నది సభ్యుల మనోగతంగా మంత్రి పేర్కొన్నారు. 2016లో ప్రైవేటు వర్సిటీల చట్టం తేవడం జరిగిందని, గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసిందన్నారు. అవి యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్దంగా ఉన్నాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ వర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్-100 గ్లోబల్ వర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉండాలని నిబంధన విధించారు. ఈ విషయంలో యూజీసీ నిబంధనలు వేరుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పూర్తిస్థాయిలో చర్చించి, ఆ చట్టాన్ని సవరించాల్సి ఉందన్నారు. విశాఖలో ఏఐ వర్సిటీ, అమరావతిలో స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రైవేటు వర్సిటీలు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఏఎంఈ వర్సిటీ ఫిలిప్పీన్స్ ఆసక్తి కనబర్చాయని చెప్పారు. ఇతర వర్సిటీల ప్రతినిధులు కూడా చర్చలకు వస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలో భారత్ లో టాప్ వర్సిటీలతో పాటు విదేశీ యూనివర్సిటీలను ఏపీకి తెచ్చేవిధంగా ప్రోత్సహిస్తామని మంత్రి లోకేశ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa