ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే భారత్‌కు సునీతా విలియమ్స్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:07 PM

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకోవడంతో ఆమె కుటుంబంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 9 నెలల నిరీక్షణ, ఏం జరుగుతుందోననే ఆందోళనలకు తెర పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని ఆమె పూర్వీకులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు డ్రాగన్ కాప్సూల్ విజయవంతంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లోకి దిగిన విషయం తెలిసిందే. భూమికి సురక్షితంగా చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని సునీతా విలియమ్స్ అన్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల కుటుంబం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టింది.


సునీతా విలియమ్స్ బంధువు ఫల్గుని పాండ్యా మాట్లాడుతూ.. డ్రాగన్ కాప్సూల్ ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములతో క్షేమంగా దిగిన క్షణాలు మాటల్లో చెప్పలేనివని అన్నారు. త్వరలోనే విలియమ్స్ భారత్‌కు వస్తారని ఆయన ధ్రువీకరించారు. ‘ఆమెతో కలిసి వెకేషన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాం.. 286 రోజుల తర్వాత భూమికి వచ్చిన ఆమెతో కుటుంబ సమేతంగా చాలా సమయం గడపబోతున్నాం’ అని ఆమె తెలిపారు. సునీతా మళ్లీ అంతరిక్షానికి వెళ్లడం లేదా మార్స్‌పై అడుగుపెట్టబోయే మొదటి వ్యక్తి అవుతారా? అంటే.. అది ఆమె ఛాయిస్ అని ఫల్గుని పాండ్యా బదులిచ్చారు. ఐఎస్ఎస్‌లో ఉన్నన్ని రోజులు ప్రతి సందర్భాన్ని ఆమె ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారని... తమకు ఆమె ఓ రోల్ మోడల్ అని ఆమె పేర్కొన్నారు.


సునీతా విలియమ్స్ పుట్టిన రోజుకు భారతీయ స్వీట్ కాజు కట్లి పంపుతానని చెప్పారు. గతేడాది సెప్టెంబరు 19న ఐఎస్ఎస్‌లో 59వ పుట్టిన రోజును జరుపుకున్నారు. తన సోదరి భూమికి క్షేమంగా తిరిగొచ్చిన సందర్భంగా ఆలయానికి వెళ్లి పూజలు చేస్తానని పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. మార్చి 1న రాసిన ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. యావత్తు భారతీయు తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు అందులో వివరించారు. అలాగే తాను అమెరికాలో పర్యటించినప్పుడు ఓ కార్యక్రమంలో.. ప్రముఖ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిశానని మోదీ వెల్లడించారు. ఆయనతో మాట్లాడుతుండగా.. మీ పేరు ప్రస్తావనకు వచ్చిందని చెప్పుకొచ్చారు.. అప్పడు తనతో పాటు భారత ప్రజలంతా మీ పని పట్ల ఎంత గర్వపడుతున్నామో చెప్పామని వివరించారు. ఈ సంభాషణ తర్వాతే నేను మీకు ఉత్తరం రాయాలనుకున్నానని చెప్పుకొచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు నీ విజయాన్ని చూసి గర్విస్తున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa