ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 10:34 PM

1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ అరుదైన రికార్డును సృష్టించింది. ముఖ్యంగా ఎంఎఫ్ హుస్సనే పెయింటింగ్‌లలో అత్యంత గణనీయమైన, ముఖ్యమైన పెయింటింగ్‌గా పేరొందిన అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) ఏకంగా 118 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో.. ఈ పెయింటింగ్‌ను 13.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ 1937లో వేసిన "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్‌ను 2023లో ముంబయిలో వేలం వేయగా ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ముఖ్యంగా 7.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.61.8 కోట్లు) పెట్టి ఒకరు దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా రికార్డులో ఉంది. అయితే తాజాగా దీన్ని వెనక్కి నెడుతూ.. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రికార్డు సృష్టించింది. గతంలో రికార్డులో ఉన్న ధర కంటే రెండు రెట్లు ఎక్కువకు అమ్ముడు పోయింది.


ఎంఎఫ్ హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన ఈ గ్రామ్ యాత్రను దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో వేశారు. ఒకే కాన్వాస్‌లో మొత్తంగా 13 ప్రత్యేకమైన చిత్రాలతో రూపొందించారు. అయితే దీన్ని తాజాగా ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో వేలం వేసింది. ఈక్రమంలోనే దీన్ని 13.8 మిలియన్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. దీంతో సదరు సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అద్భుత కళాఖండం కొత్త రికార్డు సృష్టిండంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్టీస్ సౌత్ ఏషియన్ మోడ్రన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ అధిపతి నిషాద్ అవారి తెలిపారు.


1954వ సంవత్సరంలో భారత దేశాన్ని వదిలి వెళ్లింది ఈ పెయింటింగ్. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీన్ని కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి ఎక్కడా పెద్దగా ఈ పెయింటింగ్ కనిపించలేదు. అయితే ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం థోరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని స్థాపించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఈక్రమంలోనే 1964లో వోలోడార్స్కీ ఈ పెయింటింగ్‌ను ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందజేశారు. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుందని కూడా వెల్లడించారు. అయితే గతేడాది లండన్‌లో నిర్వహించిన వేళంలో 3.1 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం రూ.25.7 కోట్లకు) ఈ పెయింటింగ్ అమ్ముడు పోయింది. ఒక్క సంవత్సరంలోనే తిరగి దీన్ని వేలంలో పెట్టగా రికార్డు ధర పలికింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa