ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరుణించిన వరుణుడు.. మ్యాచ్‌కు లైన్‌ క్లియర్‌.. ప్రస్తుత పరిస్థితి ఇదీ

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:52 PM

ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ వేదిక అయిన కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మ్యాచ్ జరిగే శనివారం రోజు వర్షం కురుస్తుందని పేర్కొంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌ నిరాశలో కూరుకుపోయారు. వరుణదేవుడు కాస్త కనికరించాలని కోరుకున్నారు.


ఫ్యాన్స్ పూజలు ఫలించాయో ఏమో తెలీదు కానీ.. కోల్‌కతాలో ప్రస్తుతం వర్షం ఆగిపోయింది. గత మూడు- నాలుగు గంటలుగా కోల్‌కతాలో వర్షం కురవడం లేదు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ మ్యాచ్‌ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు నెటిజన్లు ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్‌లో ఉన్న వాతావరణానికి సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇందులో ఎండకాస్తున్నట్లు చక్కగా కనిపిస్తోంది. స్టేడియానికి దగ్గరగా తాను ఉన్నానని.. మ్యాచ్‌కు అనుకూలంగా వాతావరణం ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.


ఇక ఆక్యూ వెదర్‌ రిపోర్ట్‌ను చూసినా ఇదే విషయం స్పష్టం అవుతోంది. ప్రస్తుతం వాతావరణం మాత్రం కాస్త పొడిగానే ఉన్నప్పటికీ.. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్యూ వెదర్ అంచనాల ప్రకారం.. సాయంత్రం 6 నుంచి కోల్‌కతాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే..


సమయం సాయంత్రం ఆరు గంటలు: మధ్యాహ్నంతో పోలిస్తే ఈ సమయంలో మబ్బులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ వర్షం పడే అవకాశాలు మాత్రం తక్కువే ఉన్నాయి. ఈ సమయంలోనే ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది. సమయం రాత్రి 7 గంటలు: డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు టాస్ పడే సమయం. ఆ సమయంలోనూ మబ్బులు ఉంటాయి. కానీ వర్షం పడదు.


రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకూ కూడా వర్షం పడే అవకాశాలు కనిపించడం లేదు. అయినే అనూహ్యంగా వర్షం కురిసినా.. కనీసం 5 ఓవర్ల ఆటనైనా ఆడించే అవకాశం ఉంది. అలా కూడా సాధ్యంకాని పక్షంలో మ్యాచ్‌ను రద్దు చేసి.. రెండు జట్లకూ చెరొక పాయింట్‌ ఇస్తారు.


ఇక తాజాగా పీవీఆర్ ఐనాక్స్,, బీసీసీఐతో డీల్ చేసుకుంది. వీకెండ్ సహా ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్ని తమ పీవీఆర్ సినిమాస్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. గతంలో మంచి స్పందన లభించిందని.. అందుకే ఈసారి నగరాలు, స్క్రీన్స్ లిస్ట్ పెంచినట్లు పీవీఆర్ సంస్థ వెల్లడించింది. దీంతో స్టేడియంలో నేరుగా చూడలేని వారికి ఇది మంచి వినోదం అందిస్తుందని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com