ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. థియేటర్లలో ఐపీఎల్ మ్యాచ్‌లు

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:53 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ రానే వచ్చింది. 18వ సీజన్ మార్చి 22 నుంచే ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక దాదాపు 2 నెలల పాటు అంతులేని వినోదాన్ని పంచేందుకు.. సంబరాల్లో ముంచెత్తేందుకు వచ్చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. మ్యాచ్‌ల్ని నేరుగా స్టేడియంకు వెళ్లి చూడాలనుకునే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కానీ టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. స్టేడియం సామర్థ్యం తక్కువ ఉంటుంది. కాబట్టి స్టేడియాలకు వెళ్లలేని వారు.. టీవీల్లోనో, బయట ఫ్యాన్ పార్క్స్ ఏర్పాటు చేస్తే అక్కడ చూడటం వంటివి చేస్తుంటారు.


అయితే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌ల్ని థియేటర్లలో చూసే వెసులుబాటు కల్పిస్తోంది ప్రముఖ సినిమా ఎగ్జిబిటర్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌. తాజాగా ఈ సంస్థ.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలితో (BCCI) సంయుక్తంగా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు IPL 2025 మ్యాచులను దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాల్లోని పీవీఆర్‌ ఐనాక్స్‌ సినిమాస్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంటే ఇప్పుడు ఐపీఎల్ కోసం ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకు పీవీఆర్ ఐనాక్స్ సిద్ధమైంది. మార్చి 22న జరిగే ప్రారంభోత్సవ వేడుకతోనే ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌ మొదలవుతుందని సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా వీకెండ్‌ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు థియేటర్లలో లైవ్‌ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.


థియేటర్లలో హై-క్వాలిటీ విజువల్స్‌ అండ్ సౌండ్‌ ఎఫెక్ట్స్‌‌తో ప్రేక్షకులకు స్టేడియంలో ఉన్న అనుభూతిని కలిగించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రీమియం సీటింగ్‌ అం్ గ్రాండ్ స్క్రీన్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తూ.. సాధారణ టీవీ స్క్రీన్‌ కన్నా విపరీతంగా పెద్ద స్క్రీన్‌పై మ్యాచ్‌లను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి చూడడానికి వీలుగా.. ఫన్‌ పబ్‌లు, బార్‌లు కాకుండా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణంలో మ్యాచ్‌లను చూడటానికి అవకాశం ఉంటుంది. పెద్ద తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా అసలైన ఐపీఎల్‌ థ్రిల్‌ను అనుభవించవచ్చని చెబుతోంది.


ఇక ఈ మ్యాచ్ సమయంలో థియేటర్లలో చూసేందుకు.. పీవీఆర్ ఐనాక్స్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ థియేటర్ స్క్రీనింగ్‌ ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2, టైర్ 3 సిటీలలో కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాలు అలాగే.. విజయవాడ, విశాఖపట్నం, లక్నో, చండీగఢ్, జైపూర్, ఇండోర్ వంటి ఇతర ప్రధాన నగరాల్లో థియేటర్లలో మ్యాచ్‌ల్ని చూడొచ్చు.


'గతేడాది థియేటర్లలో క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన తెచ్చుకుంది. ఈసారి ఐపీఎల్ 2025 కోసం మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం." అని పీవీఆర్‌ ఐనాక్స్‌ రెవెన్యూ, ఆపరేషన్స్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా చెప్పారు. సినిమాను, క్రికెట్ అభిమానులను ఒకే వేదికపైకి తేవడం మాకు గర్వకారణం అని అన్నారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 10 జట్లు బరిలో ఉండగా.. 74 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 26న ఫైనల్ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa