పార్లమెంట్ ఆవరణలో.. సోమవారం నుండి అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ ప్రారంభం కావడానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నిర్ణయం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాల మేరకు తీసుకోబడింది. సోమవారం నుండి మార్చి 28వ తేదీ వరకు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేసినట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలియజేశాడు. అరకు కాఫీ అనేది ఏపీ గిరిజనుల చేత పండించబడిన ప్రత్యేకమైన కాఫీ. ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి పేరు ఉంది. రేపు లోక్సభ స్పీకర్ ఆదేశాల మేరకు రెండు కాఫీ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ స్టాల్స్ సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఉంటాయి. దీని కోసం గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభించడం ద్వారా దేశంలోని గిరిజన రైతుల కష్టాలపై ప్రపంచం దృష్టిపెట్టబోతోందని విజయనగరం ఎంపీ అన్నారు.
అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఏపీ గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గిరిజనుల అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడనుండగా.. ఈ కాఫీ తయారీ వల్ల ఆంధ్రప్రదేశ్ గిరిజనులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అధిగమించడానికి దోహదం చేయనుంది.
అరకు కాఫీ.. ప్రస్తుత సందర్భంలో సుదూర గ్రామాల కాఫీ రైతులకి మంచి ఆదాయ మార్గాలను తెస్తుంది. పార్లమెంట్ లో జరిగే ఈ కార్యక్రమం కేవలం గిరిజన రైతుల అభివృద్ధి కోసమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రాధాన్యం ఇచ్చే ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని, ఏపీ కూటమి ఎంపీలు తదితరులు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa