అమెరికా పౌరసత్వం కల్పించే గోల్డ్ కార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. ఈ గోల్డ్ కార్డును కొనుగోలు చేసి నేరుగా అమెరికా పౌరసత్వం పొందే అవకాశాన్ని ట్రంప్ కల్పించారు.ఈ గోల్డ్ కార్డు కారణంగా వీసా అక్రమాలు అరికట్టవచ్చని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ 2.0 పాలన పెను సంచలనాలతో సాగుతోంది. మొదటి రోజు నుంచే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. అమెరికా పౌరసత్వం, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇక అమెరికాలో పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేసి.. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ట్రంప్.. కొత్తగా కొన్ని రోజుల క్రితం గోల్డ్ కార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వం పొందడమే ఈ గోల్డ్ కార్డు పౌరసత్వం. 5 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.43.5 కోట్లు చెల్లించి ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం కల్పించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ను తాజాగా డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడి విమానం అయిన ఎయిర్ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడే సమయంలో ట్రంప్.. ఆ గోల్డ్ కార్డును చూపించారు. ట్రంప్ ఫోటోతో ఉన్న ఆ గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. ఇక ఈ గోల్డ్ కార్డును తానే మొదట కొనుగోలు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే రెండో గోల్డ్ కార్డును ఎవరు కొంటారు అనేది తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ గోల్డ్ కార్డ్ 2 వారాల్లో అమ్ముడు అయిపోతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈబీ-5 ప్రోగ్రామ్ను ఉపయోగించి చేస్తున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు ఈ గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. చట్టబద్ధంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి రూ.43.5 కోట్లు వెచ్చించేవారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను అమెరికాలోకి ఆకర్షించేందుకే ఈ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
అలాంటి సంపన్నులు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డుకు భారీగా డిమాండ్ ఉందని ఒకేరోజు వెయ్యి కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
1990లో అమెరికా ఈ ఈబీ-5 వీసా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం కింద వేలాదిమంది ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ ఈబీ-5 వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని.. కొందరు అక్రమంగా దోచుకుంటున్నారని తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేయగా.. తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa