ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్ సన్రైజర్స్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. కామిందు మెండిస్కు బంతి అందించాడు. ఈ సమయంలోనే మెండిస్ తన బౌలింగ్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. వేసింది ఒక్క ఓవరే అయినా.. ఓ వికెట్ తీశాడు. కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో రెండు చేతులతో బౌలింగ్ చేసి ఐపీఎల్లో వికెట్ పడగొట్టిన తొలి బౌలర్గా కామిందు మెండిస్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రైట్ హ్యాండర్ బ్యాటర్స్కు అతడు లెఫ్టర్మ్ ఆర్థోడాక్స్తో బౌలింగ్ చేశాడు. అదే విధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. అతడు ఏ చేతిలో బౌలింగ్ వేసినా.. యాక్షన్ మాత్రం ఒకేలా ఉంటుంది. దీంతో అతడు సవ్యసాచికి ఉదాహారణగా మారిపోయాడు.
కాగా కామిందు మెండిస్లోని ప్రత్యేకతను సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం గుర్తించింది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తొలి మూడు మ్యాచ్లలో అతడికి తుది జట్టులో చోటు మాత్రం దక్కలేదు. దీంతో అతడు బెంచ్కే పరిమితమయ్యాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో మాత్రం అతడికి ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కింది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో ఒకే ఓవర్ వేసిన అతడు.. నాలుగు పరుగులు ఇచ్చి.. రఘువంశీ వికెట్ తీశాడు. ఇక బ్యాటింగ్లోనూ ఫర్వాలేదనిపించాడు. 20 బంతులు ఎదుర్కొని.. 27 రన్స్ చేశాడు. ఇందులో రెండు సిక్స్లు, ఒక ఫోర్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa