వలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జీఓల ఆధారంగానే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. ప్రభుత్వం నుంచే వలంటీర్లకు చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. ఇప్పుడు వలంటీర్ల నియామకం, వారికి జీతాల చెల్లింపులతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రభుత్వ విధివిధానాలు, ఉత్తర్వులతోనే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైంది. దానికి సంబంధించి వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో జారీ చేసిన జీఓలు, బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ వలంటీర్ల కోసం చేసిన కేటాయింపుల అధికారిక ఉత్తర్వులను ఈ మీడియా సమావేశంలో ప్రజలందరికీ చూపిస్తున్నాము. వాటిని తప్పు అని కూటమి ప్రభుత్వం చెప్పగలదా? ఇవ్వన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవే. వీటి గురించి ఏ మాత్రం అవగాహన లేనట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అబద్దాలపైన అబద్దాలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిన వైనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గోడు వెళ్ళబోసుకోవడానికి వెళ్ళిన వలంటీర్ల పట్ల ఆయన వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. వలంటీర్లు ఎవరో తెలియనట్లుగా పవన్ మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆయన శాఖ పరిధిలో పనిచేసిన వారి గురించి ఏ మాత్రం తెలియనట్లుగా వ్యవహరించడం చూస్తే నమ్మించి ఇంత దారుణంగా వంచిస్తారా అని ఆశ్చర్యం కలుగుతోంది. ప్రభుత్వం జీఓ ద్వారా వలంటీర్లను నియమించింది. నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కల్పిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. దీనికి గానూ రెవెన్యూశాఖ బడ్జెట్లో వారి కోసం కేటాయింపులు కూడా చేసింది. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. వీటిని గమనించకుండా వలంటీర్లకు ప్రభుత్వంతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రిగా పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయంలో అబద్దాలు చెప్పడం సరికాదు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa