ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్తో గుజరాత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు ఆరంభంలో వికెట్ తీసినప్పటికీ ఆ తర్వాత వికెట్లు పడగొట్టడంతో విఫలమయ్యాడు. దాంతో గుజరాత్ బ్యాటర్లు చెలరేగిపోయి 200కు పైగా పరుగులు చేశారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఆ జట్టు ప్లేయర్లు నిలకడగా రాణించారు. గిల్ మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన జోస్ బట్లర్-సాయి సుదర్శన్ రెండో వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బట్లర్ 25 బంతుల్లో ఐదు ఫోర్లతో 36 పరుగులు చేశాడు. షారూఖ్ ఖాన్ కూడా 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36 పరుగులు చేశాడు.
ఓపెనర్ సాయి సుదర్శన్ తన స్పెషల్ ఇన్నింగ్స్తో మరోసారి ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గిల్ అవుటయినప్పటికీ నిలకడగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 80+ స్కోర్ చేయడం ఇది రెండోసారి.
ఆఖర్లో రషీద్ ఖాన్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 12 పరుగులు చేయగా, రాహుల్ తెవాటియా 12 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండ్, మహీష్ తీక్షణ చెరి రెండు వికెట్లు తీసుకోగా.. సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 218 పరుగులు చేయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa