భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు, ఉచిత వినియోగ పరిమితులను సవరించింది. వేర్వేరు రకాల అకౌంట్లకు సంబంధించి ఇవి వేర్వేరుగా ఉన్నాయి. ఈ సవరించిన నియమాలు 2025, ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నూతన విధానం ఫీజు శ్లాబ్లను సరళీకృతం చేయడంతో పాటుగా.. డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం ఇంకా.. మెట్రో అండ్ నాన్-మెట్రో ప్రాంతాలలో వినియోగ పరిమితులను ప్రామాణీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ కొత్త నియమనిబంధనలతో.. ఎవరిపై ప్రభావం పడుతుంది.. ఉచిత పరిమితులు దాటిన తర్వాత మీరు ఎంత చెల్లించాల్సి వస్తుందో ఇక్కడ చూద్దాం. ఈ మార్పులు ఎస్బీఐ ఏటీఎంలు, అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా చేసే ఆర్థిక (ఫైనాన్షియల్), ఆర్థికేతర (నాన్ ఫైనాన్షియల్) లావాదేవీలపై ప్రభావం చూపుతాయి.
ఎస్బీఐ వివిధ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (సగటు నెలవారీ నిల్వ- ) శ్రేణిలోని సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను సవరించింది. దీని ప్రకారం.. ఖాతాదారులు తమ ఏఎంబీ లేదా లొకేషన్తో (మెట్రో లేదా నాన్-మెట్రో) సంబంధం లేకుండా, ఎస్బీఐ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలకు అర్హులు.
రూ. 25,000- రూ. 50,000 మధ్య నెలవారీగా సగటు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసే కస్టమర్లు.. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పుడు ఉచిత లావాదేవీలు 5 వరకు చేసుకోవచ్చు. ఇదే రూ. 50,000- రూ. లక్ష మధ్య బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తే కూడా వర్తిస్తుంది. ఇక రూ. లక్షకు మించి యావరేజ్ బ్యాలెన్స్ ఉంటే.. వారు ఎస్బీఐ సహా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలను పొందొచ్చు.
ఏటీఎం సర్వీస్ ఛార్జీలు..
ఎస్బీఐ తమ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే వారికి ఛార్జీలు విధిస్తుంది. ఈ ఛార్జీల్ని కూడా ఇప్పుడు సవరించింది బ్యాంకు. ఈ ఛార్జీలు లావాదేవీ రకం (ఆర్థిక లేదా ఆర్థికేతర) అలాగే.. ఉపయోగించిన ఏటీఎం రకం (ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకులు) ఆధారంగా మారుతూ ఉంటాయి.
ఆర్థిక లావాదేవీలపై ఛార్జీలు..
మీరు మీ నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల కోటాను ఉపయోగించిన తర్వాత.. ఎస్బీఐ ఏటీఎంలలో ప్రతి లావాదేవీకి రూ. 15 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తే అదనంగా చేసే ప్రతి లావాదేవీకి రూ. 21 + జీఎస్టీ ఉంటుంది. ఇక్కడ ప్రాంతంతో సంబంధం లేకుండా కొత్త రూల్స్ తెచ్చింది. చూసుకోండి మరి.. అదనంగా ఇలా చేసే ప్రతి లావాదేవీపైనా ఇలా భారీగా ఛార్జీ పడుతుంటుంది.
ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు..
బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్పైనా పరిమితులు ఉన్నాయి. ఈ సేవలపై ఉచిత పరిమితి తర్వాత ఎస్బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీ లేదు. అయితే.. మీరు వీటిని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేస్తే.. అదనంగా చేసే ప్రతి లావాదేవీకి రూ. 10 + జీఎస్టీ చెల్లించాలి.
చివరగా.. మీ సేవింగ్స్ ఖాతాలో తగినంత నిధులు లేకపోవడం వల్ల మీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే.. ఫైన్ అంతకుముందు మాదిరిగానే రూ. 20 + జీఎస్టీగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa